
నూతన రహదారుల నాణ్యతకు సంబంధించి ప్రజల్లో అపోహ కలిగే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రాంతంలో ఇటీవల వేసిన తారు రోడ్డు నాణ్యతపై ఉద్దేశపూర్వకంగా ఒక వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో కొందరు సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవ విషయం ఏమిటంటే నూతనంగా నిర్మించిన ఆ రోడ్డుకు సంబంధించిన బిల్లులను కాంట్రాక్టర్ కు చెల్లించే ముందు నాణ్యతా పరీక్షలు నిర్వహించడం జరిగింది. నాణ్యతా పరీక్షలు నిర్వహించేందుకు రోడ్డు మధ్యలో గుంత తీస్తారు. నాణ్యతా పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఆ గుంతలను తాత్కాలికంగా పూడుస్తారు. ఇదే అదనుగా భావించిన కొందరు తాత్కాలికంగా పూడ్చిన ఆ గుంతను, అందులోని మెటీరియల్ ను చూపించి నాణ్యతపై అపోహలు కలిగే విధంగా వీడియో చిత్రీకరించారు. రహదారులు మాత్రమే కాకుండా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పారదర్శకత, ఉన్నత ప్రమాణాల పట్ల నిబద్ధతతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలోని సామాజిక తనిఖీ వ్యవస్థ వరుసగా రెండో సంవత్సరం కూడా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి, శాతం వంద తనిఖీలు, పర్యవేక్షణ సాగిస్తున్నదని స్పష్టం చేస్తున్నాం. అపోహలు సృష్టించే విధంగా తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.
#FactCheck
#AndhraPradesh
తెలుగు






